హైదరాబద్, ఫిబ్రవరి 1: టీఆర్ఎస్ నేత, మంత్రి హరీష్ రావు సంచలన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన టీఎంయూ (తెలంగాణ మజ్దూర్ యూనియన్) గౌరవాధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. ఇందులో భాగంగా టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డికి రాజీనామా లేఖను పంపించారు. ఇతర అధికార కార్యక్రమాల వల్ల టీఎంయూ కార్యక్రమాలకు సమయం కేటాయించలేకపోవడం వల్లే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా టీఎంయు నెలకొల్పడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కార్మికుల భాగస్వామ్యం పెంచాలనే లక్ష్యంతో హరీశ్ టీఎంయు బాధ్యతలు స్వీకరించారు.
ఉద్యోగ సంఘాల డిమాండ్ల పరిష్కారంతో పాటు తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులను ముందుండి నడిపించడంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు. అయితే ఇంత హఠాత్తుగా హరీశ్ రావు ఈ నిర్ణయం తీసుకోవడం ఆర్టీసీలోని కార్మిక సంఘాలతో పాటు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.