అమరావతి, జనవరి 31: వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోదని వొంటరిగా పోరాడుతుందని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. కేంద్రంలో ఏ పార్టీకి కూడ పూర్తి మెజారిటీ రాదని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం నాడు అన్న పిలుపు కార్యక్రమంలో భాగంగా తటస్థులతో నిర్వహించిన సమావేశంలో జగన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు పార్టీల మాటలు నమ్మి పొత్తులు పెట్టుకొంటే మోసపోతామని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ ఎన్నికల్లో ఏ పార్టీతో కూడ పొత్తులు పెట్టుకోబోమని ఆయన స్పష్టం చేశారు. వొంటరిగానే వైసీపీ పోటీ చేస్తోందని ఆయన తేల్చేశారు. విశాఖకు రైల్వేజోన్ చట్ట ప్రకారం రావాల్సి ఉందన్నారు. రైల్వే జోన్ కోసం తాను పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. అన్ని రాష్ట్రాలకు రైల్వేజోన్ ఉన్నప్పుడు ఏపీకి ఎందుకు రైల్వే జోన్ ఉండకూడదని జగన్ ప్రశ్నించారు.అన్న పిలుపు కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లాలో తటస్థులను కలవనున్నట్టు జగన్ చెప్పారు.ప్రతి కులానికి ఓ కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. నవరత్నాలను చంద్రబాబునాయుడు కాపీ కొడుతున్నారని జగన్ చెప్పారు.