హైదరాబాద్, జనవరి 31: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అగ్నిప్రమాద ఘటనపై ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ ఈటల రాజేందర్ పాలక వర్గ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం గురించి చర్చించారు. జరిగిన ఘటనపై ఎగ్జిబిషన్ కమిటీ సంతాపాన్ని వ్యక్తం చేసింది. అగ్నిప్రమాద ఘటన వివరాలను ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని ఈటెల రాజేందర్ తెలిపారు. ప్రమాదం దృష్ట్యా ఈరోజు, రేపు రెండు రోజులపాటు ఎగ్జిబిషన్ను నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రమాదంలో నష్టపోయిన వ్యాపారులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.
ఎగ్జిబిషన్ లోని షాపులకు ఎలాంటి ఇన్సూరెన్స్ లేదని, బాధితులకు సొసైటీ తరపున తక్షణ సాయం అందిస్తామని ఈటల హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఎగ్జిబిషన్ సొసైటీ వ్యాపార సంస్థ కాదని, దీని ద్వారా వచ్చే ఆదాయంతో పద్దెనిమిది విద్యాసంస్థలు నిర్వహిస్తున్నామని, త్వరలోనే అనాథ పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించాలనుకుంటున్నట్లు ఈటల తెలిపారు.