వేములవాడ, జనవరి 31: సిరిసిల్లలోని వేములవాడ రాజన్నకు భక్తులు సమర్పించిన బంగారు కానుకలను ఆలయ అధికారులు, బ్యాంక్ కు అప్పగించనున్నారు. హుండీల్లో భక్తులు వేసిన మిశ్రమ బంగారాన్ని గోల్డ్ మానిటరైజేషన్ స్కీం కింద జమ చేయనున్నారు. 2010 సంవత్సరం నుంచి 2015 మధ్య కాలంలో ఆలయ ఖజానాకు దాదాపు 18 కిలో గ్రాముల బంగారం సమకూరినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఏడాదికి స్వామివారికి దాదాపు రూ.12 లక్షల వరకు వడ్డీ వచ్చే అవకాశం ఉన్నట్లు ఆలయ అధికారులు అంచనా వేసారు. 2010లో 25 కిలోల బంగారాన్ని ఇదే విధంగా బ్యాంకులో జమ చేయగా, దానికి సంవత్సరానికి వడ్డీ వస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
వేములవాడ ఆలయంలో ఉన్18 కిలోల బంగారాన్ని గురువారం ఎస్బీఐ అధికారులకు అప్పగించనున్నారు. దీనికోసం దేవాదాయ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, ఎస్బీఐకి చెందిన ఉన్నతాధికారులు గురువారం ఉదయం వేములవాడ చేరుకున్నారు. ఆలయ అధికారులు, బ్యాంకు అధికారుల సమక్షం లో బంగారాన్ని బ్యాంకు కి అప్పగిస్తామని ఈవో దూస రాజేశ్వర్ తెలిపారు.