అవినీతి రహిత భారతదేశం: రాష్ట్రపతి

SMTV Desk 2019-01-31 11:59:25  Ram Nath Kovind, Mahatma Gandhi, Jallianwala Bagh

న్యూ ఢిల్లీ, జనవరి 31: ఈరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ఈరోజు నుండి ఫిబ్రవరి 13 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మాట్లాడుతూ 2019 సంవత్సరం మన దేశ చరిత్రలో చాలా కీలకమైనది. ఎందుకంటే ఈ ఏడాదే మనం మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలను జరుపుకుంటున్నాం. ఇదే ఏడాది ఏప్రిల్ 13న పంజాబ్ లోని జలియన్ వాలాబాగ్ దురాగతం జరిగి వందేళ్లు పూర్తి అవుతాయి. మనందరి ఉజ్వల భవిష్యత్ కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరులందరికీ నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను అని తెలిపారు.

గాంధీజీ కలలు కన్నదిశగా భారత్ పురోగమిస్తోంది, బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ విలువల ఆధారంగా ముందుకు సాగుతోంది. గౌరవనీయులైన సభ్యుల్లారా.. 2014 ఎన్నికలకు ముందు దేశంలో అనిశ్చితి కొనసాగేది. కానీ నా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచే అవినీతి, ఆశ్రిత పక్షపాతం లేకుండా దేశ ప్రజల కష్టాలను దూరం చేసేందుకు ప్రయత్నించింది. కట్టెల పొయ్యిలో వంట వండుతూ ఇబ్బంది పడే తల్లి, మరుగుదొడ్లు లేక చీకటి పడేవరకూ ఇంట్లోనే ఉండిపోయే సోదరి, విద్యుత్ లేక ఇబ్బంది పడే పిల్లాడు, మౌలిక వసతులు లేక నష్టపోయే రైతులు.. వీరందరూ నా ప్రభుత్వానికి లక్ష్యాలను నిర్దేశించారు. వీరిని దృష్టిలో పెట్టుకునే పలు పథకాలను రూపొందించాం అని కోవింద్ అన్నారు.