గాంధీనగర్, జనవరి ౩౦: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం గుజరాత్ లోని సూరత్ లో నిర్వహించిన ఓ బహిరంగ సభ కు హాజరయ్యారు. ఆ కార్యక్రమం లో ప్రధాని మోడీ ప్రసంగిస్తుండగా అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమం కవరేజ్ కు వచ్చిన కిషన్ రమోలియా అనే కెమెరామెన్ కళ్లు తిరిగి కింద పడిపోయారు. దీంతో, మోదీ తన ప్రసంగాన్ని ఆపివేసి, అతన్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లాలని మోదీ వేదికపై నుంచే ఆదేశించారు. కిషన్ ను వెనువెంటనే బీజేపీ కార్యకర్తలు, భద్రతా సిబ్బంది హాస్పిటల్ కి తరలించారు. తరువాత మోడీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇంతకుముందు కూడా మోదీ తన ప్రసంగాన్ని వొకసారి మధ్యలో ఆపేశారు. గత ఏడాది, ఈశాన్య రాష్ట్రాల ఘనవిజయంపై న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంలో ప్రసంగిస్తున్న సమయంలో ఆ సమీపంలోని మసీదు నుంచి అజాన్ వినపడగానే ప్రసంగాన్ని ఆపేశారు. అజాన్ ముగిసిన తర్వాత ప్రసంగాన్ని కొనసాగించారు.