అమరావతి, ఆగష్టు 1: ఇప్పటికే ఎపి ఎంసెట్-2017 రెండో విడత కౌన్సెలింగ్ పూర్తి చేసినప్పటికీ ఇంకా కొన్ని కళాశాలల్లో సీట్లు భర్తీ కాని దృష్ట్యా మూడో విడత కౌన్సెలింగ్ ఈనెల మొదటి వారంలో నిర్వహించనున్నట్లు సమాచారం. మంగళవారం నిర్వహించనున్న ఎంసెట్ ప్రవేశాల కమిటీ సమావేశంలో కౌన్సెలింగ్ షెడ్యూల్పై నిర్ణయం తీసుకోనున్నారు. రెండో విడతలో యూనివర్సిటీ కళాశాలల్లో సీట్లు పొందిన వారిలో 483ఇంజనీరింగ్, 14 ఫార్మసీ విద్యార్థులు చేరలేదు. జరగనున్న మూడో విడత కౌన్సిలింగ్లో ఈ సీట్లు అందుబాటులో ఉంటాయి. ఈ సమావేశంలో ఒక్కరూ కూడా చేరని కళాశాలలు, 50లోపు విద్యార్ధులు చేరిన కళాశాలల్లో ప్రవేశాలపై కూడా నిర్ణయం తీసుకోబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరం ఇంజనీరింగ్ ప్రవేశాలు మాత్రమే కాదు ఇతర అన్ని వృత్తి విద్యా కోర్సులలో ప్రవేశాలు తగ్గడం గమనార్హం.