జనవరి 30: ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తలపెట్టిన అఖిలపక్ష సమావేశంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతోనే సీఎం చంద్రబాబు అఖిలపక్ష సమావేశానికి పిలుపు ఇచ్చారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇస్తామన్నప్పుడు అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకహోదా కోసం ఫస్ట్ నుంచి వైసీపీ మాత్రమే పోరాడుతోందన్నారు. ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ఏపీకి హోదా వద్దు-ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబు ఇప్పుడు అఖిలపక్ష భేటీని నిర్వహించడం హాస్యాస్పదమన్నారు.అయితే తెలుగుదేశం పార్టీకి తప్ప హోదా కోసం పోరాడే ప్రతీ వొక్కరికి వైసీపీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.