న్యూ ఢిల్లీ, జనవరి ౩౦: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళా ప్రధాని పీఠం అదిష్టించడానికి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనత పార్టీ మధ్య పోటి పెరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రానున్న ఎన్నికలలో ఆకట్టుకునేందుకు 'కనీస ఆదాయం పథకం' అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి దీటుగా ప్రధాని మోడీ నిరుపేదల కోసం యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్(యూబీఐ) పథకాన్ని అమలు చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
నోట్ల రద్దు, జీఎస్టీలతో ప్రజలు పడిన బాధలు మర్చిపోయేలా పథకాలు పెట్టాలని డిసైడ్ అయింది బీజేపి. అన్నింటికీ వొకే పథకంతో చెక్ పెట్టాలని యూబీఐ ను రూపొందించారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఎవరే పరిస్థితుల్లో ఉన్నా అందరికీ కనీస ఆదాయం ఉండాలని 2016-17 ఆర్థిక సర్వే తెలిపింది. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా యూబీఐని పైలెట్ ప్రాజెక్టు కింద ప్రారంభిస్తామని ప్రకటించే అవకాశం ఉంది.
2011-12లో మధ్య ప్రదేశ్లోని 8గ్రామాల్లో యూబీఐ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేసింది. ఆ తరువాత దీనిని నిలిపివేశారు. ఆహార ధాన్యాలపై సబ్సిడీని లేదా యూబీఐని రెండింటిలో ఏదో వొక దాని ద్వారా మాత్రమే ప్రజలు లబ్ధి పొందే అవకాశం ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.