అఖిలపక్ష సమావేశానికి పవన్ నో..

SMTV Desk 2019-01-30 11:11:10  Chandrababu, Pavan kalyan, TDP, Janasena, pavan letter

అమరావతి, జనవరి 30 : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు తలపెట్టిన అఖిలపక్ష సమావేశానికి రావడం లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుకు ఓ లేఖను రాసారు. ఈ లేఖలో మొక్కు బడి సమావేశాలకు తాము దూరంగా ఉంటామని పేర్కొన్నారు. బుధవారం రోజు సమావేశం పెట్టి, మంగళవారం సాయంత్రం తమకు ఆహ్వానం పంపడం ఏమిటని సీఎంని ప్రశ్నించారు. అయితే సమావేశానికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు చెబుతూనే, తగిన సమయం ఇవ్వకుండా, ఎజెండా ఏంటో చెప్పకుండా సమావేశాలు ఏంటని, ఇది రాజకీయ లబ్ది కోసమేనన్న సందేహాలున్నాయని తీవ్రంగా స్పందించారు.

అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చేందుకు జనసేన ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని, కానీ ఇటువంటి సమావేశాలు ఎటువంటి ఫలితాలు ఇవ్వవని అన్నారు. బలమైన పోరాటం చేస్తేనే రాష్ట్రానికి హోదా వస్తుందని, అటువంటి పోరాటం చేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే చేతులు కలుపుతామని తన లేఖలో పవన్ పేర్కొన్నారు.