ఇస్లామాబాద్, ఆగష్టు 1: ఇటీవల అవినీతి ఆరోపణల కేసులో పాక్ ప్రధాని పదవి నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో మంగళవారం జగనున్న పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధాని పదవి కోసం ఆరుగురు పోటీ పడుతున్నారు. ఎన్నికల్లో పాకిస్థాన్ ముస్లిం లీగ్ తరఫున షహీద్ ఖాకన్ అబ్బాసీ నామ పత్రం సమర్పించారు. మొదట్లో ఉమ్మడి అభ్యర్ధిని బరిలోకి దింపుదామని ప్రతిపక్షాలు అనుకున్నప్పటికీ, అభ్యర్థిని నిలపడంపై ప్రతిపక్షాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అయిదుగురు నామ పత్రాలు దాఖలు చేశారు. పాక్ దిగువసభ నేషనల్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 342 కాగా, 172 ఓట్లు వచ్చిన అభ్యర్థిని పదవి వరించనుంది. నవాజ్ పార్టీ, మిత్ర పక్షాలకు 209 సీట్లు ఉండడంతో అబ్బాసీ విజయం ఖాయంగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా డాన్ న్యూస్ పత్రిక కథనం ప్రకారం పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధాని అభ్యర్థి అయిన షహీద్ ఖాకన్ అబ్బాసీ కూడా అవినీతి ఆరోపణలపై విచారణ ఎదుర్కుంటున్నట్లు సమాచారం. అబ్బాసీ ధృవీకృత సహజవాయువు (ఎల్ఎన్జీ) కాంట్రాక్టు మంజూరులో అవినీతి చర్యల ఆరోపణలపై జాతీయ జవాబుదారీ సంస్థ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోందని ప్రకటించింది. ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ సుప్రీంకోర్టుకు తప్పుడు పత్రాలు సమర్పించారని నవాజ్ పార్టీ ఆరోపించింది.