అమరావతి, జనవరి 29: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రహస్య చర్చలు జరిపారు. ఆయనతో పాటు ఎబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. కానీ వీరు ముగ్గురు జరిపిన రహస్య మంతనాలు ఏమిటనేది బయటకు రాలేదు. టీడీపీలో చేరేందుకు చంద్రబాబును కలవడానికి కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వచ్చిన రోజునే వారు కూడా రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వేలు ఇచ్చి లగడపాటి రాజగోపాల్ విమర్శల పాలయ్యారు.
అయితే సర్వేలు చేయడంలో లగడపాటి దిట్ట కనుక చంద్రబాబు కోసం సర్వేలు చేస్తూ వాటిని సరిదిద్దే విషయంపై సలహాలు ఇస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎన్నికల విషయంలో ఎక్కడ ఏ విధమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఎబీఎన్ రాధాకృష్ణ సూచలను కూడా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు లగడపాటి, రాధాకృష్ణలతో చర్చలు జరపడం రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.