కుటుంబం గురించి రహస్యాలు బయటపెట్టి ?

SMTV Desk 2019-01-29 11:00:44  daggubati purandheswari, bjp, daggubati venkateswar rao, hitesh chenchram, ysr congress

హైదరాబాద్, జనవరి 29: దగ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరటంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ జోరు పెరిగిపోయింది. దీనిపై దగ్గుబాటి పురేందేశ్వరి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. తాజాగా దగ్గుబాటి పురేందేశ్వరి భర్త వెంకటేశ్వరరావు, కుమారుడు హితేశ్ లు వైసీపీ చీఫ్ జగన్‌ను కలిసినప్పటి నుంచీ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. దగ్గుబాటి కుటుంబ నిర్ణయాన్ని కొందరు తప్పుబడుతుండగా, ఇంకొందరు సమర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి ఆవేదనగా స్పందించారు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అత్యంత సున్నితమైన వ్యక్తిగత విషయాలను బయటకు లాగి రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేస్తూ ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. తాను ఇద్దరు బిడ్డలను కోల్పోయిన విషయం ఎంతమందికి తెలుసని, కుమార్తె కంటే ముందు వొకరిని, కుమారుడి కంటే ముందు మరొకరిని కోల్పోయానని పురందేశ్వరి తెలిపారు. ప్రత్యేక వైద్య చికిత్సల కోసం తాను అమెరికా వెళ్లిన విషయం ఎంతమందికి తెలుసని ప్రశ్నించారు. తండ్రి ఎన్టీఆర్ తనను బలవంతంగా అమెరికా పంపించారన్న విషయం ఎంతమందికి తెలుసు అని ప్రశ్నించారు. తనపై జరుగుతున్న ఈ మొత్తం ప్రచారం విషయంలో తాను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదన్నారు.

తన భర్త వెంకటేశ్వరరావు మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు టీడీపీ తిరస్కరించిన విషయం ఎవరికైనా తెలుసా? అని నిలదీశారు. 2014 ఎన్నికల సమయంలో తనకు టికెట్ రాకుండా చేసేందుకు తెలుగుదేశం పార్టీ విశ్వప్రయత్నాలు చేసిందన్నారు. తాను ఏ వ్యక్తినీ వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శించనని, రాజకీయాలకు అతీతంగా కుటుంబాన్ని ప్రేమిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. దయచేసి ఇకపై తన వ్యక్తిగత విషయాల జోలికి, పిల్లలు, కుటుంబం జోలికి రావొద్దంటూ నెటిజన్లను కోరారు.