హైదరాబాద్, జనవరి 29: రాష్ట్రంలో పంచాయతి ఎన్నికల మూడో విడత పోలింగ్ బుధవారం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ పోలింగ్ నిర్వహణకై ఎన్నికల అధికారులు సర్వం సిద్దం చేసుకున్నారు. ఇదివరకు జరిగిన రెండు విడతల పోలింగ్ లో 573 గ్రామాల్లో సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలి ఉన్న 3 వేల 529 గ్రామాల్లో రేపు సర్పంచ్ ఎన్నిక జరగనుంది. మొత్తం 11,667 మంది అభ్యర్థులు సర్పంచి పదవికి బరిలో నిలిచారు. ఇక ఈ గ్రామాల పరిధిలో మొత్తం 36 వేల 729 వార్డు సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది.
ఇందులో 8,956 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలి ఉన్న 27,583 వార్డులకు గానూ 67,316 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నల్గొండ, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల్లో నిలిచిపోయిన పలు వార్డులకు కూడా ఈ నెల 30న ఎన్నికలు నిర్వహించి.. అదే రోజున ఫలితాలు వెల్లడించనున్నారు. దీంతో ఆ గ్రామాల పరిధిలో నిలిచిపోయిన ఉపసర్పంచి ఎన్నికకు మార్గం సుగమమం కానుంది. మరోవైపు ప్రచారం అధికారికంగా ముగిసినా, అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రలోభాలపర్వం ఊపందుకుంది. వ్యక్తిగతంగా ఇంటింటికి వెళ్లి నజారానాలు ఇస్తున్నారు. డబ్బులతో బహుమతులు పంపిణీ చేస్తున్నారు.