అమరావతి, జనవరి 28: తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ‘‘ఎన్టీయార్-కథానాయకుడు , ఎన్టీయార్ -మహానాయకుడు సినిమాలని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కాగా కధానాయకుడు ఇప్పటికే విడుదల అవ్వగా.. మహానాయకుడు త్వరలో విడుదల కానుంది. ఈ రెండో పార్ట్ లో నాదెండ్ల భాస్కరరావు పాత్ర కూడా ఉంది. అయితే ఈ సినిమాలో తనను నెగిటివ్ గా చూపిస్తారంటూ మొదటి నుంచి మొత్తుకుంటున్న నాదెండ్ల.. మరోసారి సంచలన కామెంట్స్ చేశారు.
దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తో తెలుగుదేశం పార్టీ పెట్టించడమే తాను చేసిన పెద్ద తప్పు అని అభిప్రాయపడ్డారు. అనంతరం సీఎం చంద్రబాబుపై కూడా విమర్శలు చేశారు. చంద్రబాబు విదేశీ పర్యటనల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీతో మాటిమాటికీ తగువులు పెట్టుకోవడం ద్వారా చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బాబు బీసీ ప్రధానిని విమర్శిస్తూ..బీసీ సమావేశాలు పెట్టడం గమనార్హం అన్నారు. ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.