కర్నూలు, జనవరి 28: ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలలో వలసల జోరు పెరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రస్ నేత, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. కోట్ల రాకతో టీడీపీలో ఉన్న నేతలకు చిక్కులు తప్పకపోవచ్చు. కోట్ల కుటుంబం టీడీపీలో చేరితే ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతల సీట్లకు ఎసరు వచ్చేలా ఉంది. కర్నూల్ జిల్లాలో టీడీపీని బలోపేతం చేసేందుకు పార్టీ నాయకత్వం చేపట్టింది. ఇందులో భాగంగానే కోట్ల కుటుంబాన్ని టీడీపీలోకి ఆహ్వానించింది. ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబం గతంలో ప్రాతినిథ్యం వహించిన డోన్ అసెంబ్లీ సీటును తమకు ఇవ్వాలని కోట్ల కుటుంబం పట్టుబట్టే అవకాశం ఉందని సమాచారం.
కాగా టీడీపీతో పొత్తు పట్ల కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సానుకూలంగా ఉన్నా.. పొత్తును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. దీనిపై త్వరలోనే చంద్రబాబునాయుడుతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ భేటీలో పార్టీలో చేరికతో పాటు పలు విషయాలపై చర్చించే అవకాశం ఉంది. కర్నూల్ పార్లమెంట్ స్థానంతో పాటు కోడుమూరు, డోన్ అసెంబ్లీ నియోజకర్గాలను కూడ కోట్ల కుటుంబం అడుగుతున్నట్టు సమాచారం.