చెన్నై, జనవరి 28: నిరవ్ మోదీ కుంభకోణం నుంచి ఇంకా బయటపడనే లేదు.. ఇంతలోనే పంజాబ్ నేషనల్ బ్యాంకు కి మరో భారీ దెబ్బ తగిలింది. తమిళనాడు తిరుచ్చి జిల్లాలోని సమయపురం పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ దొంగతనం జరిగింది. ఈ దుర్ఘటనలో బ్యాంకులోని 10 కోట్ల రూపాయల నగదు, 5 కేజీల బంగారాన్ని దొంగిలించారు. జాతీయ రహదారి పక్కనే ఉండే సమయపురంలో ఇంతటి భారీ దోపిడీ జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది.
వివరాలు.. 26, 27 తేదీలన బ్యాంకుకు సెలవు కావడంతో సోమవారం ఉదయం సిబ్బంది బ్యాంకు తెరిచారు. అనంతరం బ్యాంకు లోపలికి వెళ్లి చూడగా చోరీ విషయం బయటపడింది. దుండగులు గోడకు కన్నం పెట్టి బ్యాంకు స్ట్రాంగ్ రూమ్లోని ప్రవేశించినట్టుగా తెలుస్తోంది. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్యాంకు సీసీటీవీల్లో రికార్డైన దృశ్యాలను బట్టి ముగ్గురు వ్యక్తులు ఈ దోపిడీలో పాల్గొన్నట్టు వారు అనుమానిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు.