అమరావతి, జనవరి 28: దగ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరటంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. అధికారం కోసమే దగ్గుబాటి ఫ్యామిలీ వైసీపీలో చేరారని.. వారు చేరని పార్టీలు లేవనీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్), బీజేపీ, ఇప్పుడు వైసీపీ ఇలా రకరకాల పార్టీలు మారారని దుయ్యబట్టారు. అధికారం కోసమే ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీపార్వతి వైసీపీతో కుమ్మక్కు అయ్యారని విమర్శించారు. ఈరోజు అమరావతిలో టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ..‘కాంగ్రెస్ హయాంలో దగ్గుబాటి పురందేశ్వరి కేంద్రమంత్రి, ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ను వదిలేసి బీజేపీలోకి జంప్ అయ్యారు. ఇక ఇప్పుడు వైసీపీలో చేరారు. అధికారం కోసమే వీళ్ల ఫిరాయింపులన్నీ అని విమర్శించారు. వీరంతా అవకాశవాదంతోనే ఆనాడు ఎన్టీఆర్ను వాడుకున్నారనీ, ఎన్టీఆర్ కు అప్రతిష్ట తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అవకాశవాదులంతా వైసీపీలో చేరారని వ్యాఖ్యానించారు.