బెంగుళూరు, జనవరి 28: కర్ణాటక రాజకీయాలు రోజుకో రకంగా మలుపుతీసుకుంటున్నాయి. మొన్నటి వరకు బీజేపీ పార్టీ వాళ్ళు తమ ఎమ్మెల్యే లకి డబ్బు ఆశ చూపి మా ప్రభుత్వాన్ని పడకొట్టాలని చూసిందని అటు కాంగ్రెస్ ఇటు జేడీఎస్ నేతలు ఆరోపించారు. అది ఇంకా సద్దుమణగలేదు ఆ లోపే కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్.డి.కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు హద్దులు దాటి వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పరిస్థితిని చక్కదిద్దాలని సూచించారు. లేదంటే తాను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటానని హెచ్చరించారు. బెంగళూరులో ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ నేతలు వీధుల్లోకి ఎక్కి కొట్టుకుంటే వారికే నష్టమనీ, తనకు ఎలాంటి ఇబ్బంది లేదని వ్యాఖ్యానించారు. ఇటీవల బెంగళూరు శివార్లలోని ఈగల్ టన్ రిసార్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేశ్, తోటి ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే. అలాగే పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరేందుకు రహస్యంగా చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కుమారస్వామి ఇలా మాట్లాడినట్లు తెలుస్తోంది.