ఎవరైనా చనిపోతే వారికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలను నిలిపివేస్తారు. కానీ, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించి రెండేళ్లు దాటిపోయినా ఆమె బ్యాంకు అకౌంట్లు మాత్రం ఆక్టివ్ గానే ఉన్నాయ్ . ఆ అకౌంట్లలో లావాదేవీలు కొనసాగుతూనే ఉన్నాయని ఆదాయపు పన్ను శాఖ మద్రాస్ హైకోర్టుకు ఇటీవల తెలిపింది. ఆమె భవనాలలో నివసిస్తున్నవారు, దుకాణ యజమానులు, వ్యాపారులు ప్రతినెల అద్దెను ఆమె ఖాతాల్లో జమ చేస్తున్నట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు. వారి వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.
జయలలిత మరణించడానికి పదేళ్ల ముందే ఆమె అకౌంట్లను సీజ్ చేశామని.. కాకపోతే పూర్తిగా రద్దు చేయలేదని ఐటీ శాఖ పేర్కొంది . ఆమె ఇంటికి సంబంధించిన పన్ను బకాయిలు ఉండటంతో బ్యాంకు అకౌంట్లను స్తంభింపచేశామని అంటున్నారు ఐటీ శాఖ అధికారులు . ఆమె బతికి ఉన్నప్పుడు పన్ను బకాయిలు కట్టి ఆస్తులు విడిపించుకోవాలని ఎన్నిసార్లు నోటీసులు పంపినా పట్టించుకోలేదని కోర్టుకు ఐటీ అధికారులు పై విదంగా చెప్పారు.