న్యూ ఢీల్లీ, జనవరి 27: భారతరత్న మన దేశంలోనే అత్యున్నతమైన పురస్కారం. మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పురస్కారాల ప్రకటనపై ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా అసంతృప్తి వ్యక్తం చేశారు. 70 ఏళ్ల స్వతంత్ర భారత్లో వొక్క సన్యాసికి కూడా భారతరత్న అవార్డును అందించలేదని విచారణ వ్యక్తం చేశారు. వచ్చే ఏడాదైనా సన్యాసులకు ఈ అత్యున్నత పురస్కారం ఇచ్చి గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం వొక్క సన్యాసికి కూడా భారతరత్న అవార్డు ఇవ్వకపోవడం దరదృష్టకరం. మహారుషి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, శివకుమార స్వామి లాంటి ప్రముఖులకు కూడా ఈ గౌరవం దక్కలేదు. వచ్చే ఏడాదైనా కేంద్రం సన్యాసుల పట్ల సానుకూలంగా స్పందించి వొక్కరికైనా భారతరత్న ఇస్తుందని ఆశిస్తున్నా అని రాందేవ్ పేర్కొన్నారు. ఈ ఏడాది మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికా, సామాజిక కార్యకర్త నానాజీ దేశ్ముఖ్లకు భారత రత్న అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే.