విశాఖపట్నం, జనవరి 26: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో జనసేన కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వొక బలమైన వ్యూహంతో రాజకీయాల్లోకి వచ్చానని, ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో ఏపీ అసెంబ్లీలో అడుగుపెడతామని పవన్ ధీమా వ్యక్తం చేశారు. తన దగ్గర ప్రస్తుతం అసలు డబ్బులు లేవని, జీవనోపాధిని కూడా కోల్పోయానని చెప్పారు. ఇక అభిమానులు తాము ఉన్నామంటూ, ప్రాణాలైనా ఇస్తామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పవన్ మాట్లాడుతూ.. నాకు కావాల్సింది ఓట్లు మాత్రమే మీ ప్రాణాలు కాదన్నారు. అలాగే అభిమానులకు కొన్ని సూచనలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో బైక్ ర్యాలీలు నిర్వహించి వేగంగా వెళ్లొద్దన్నారు. గాయాల పాలవ్వొద్దని సూచించారు. గాయాలైతే ఓట్లు వేసేది ఎవరని ప్రశ్నించారు. నాపై అభిమానంతో బైక్ ర్యాలీలు నిర్వహించి దెబ్బలు తింటే ఇంట్లో ఆడవాళ్లు సైతం మారిపోతారు, పవన్ కళ్యాణ్ మీటింగ్ కి వెళ్ళి దెబ్బలు తిని వచ్చాడని వారిలో నెగిటివ్ ఓపెనీయన్ వస్తే ప్రమాదమన్నారు. దయచేసి దండం పెడతా ఇలాంటి పనులు మాత్రం చెయ్యొద్దన్నారు. ఇక సర్వేల పేరుతో కొందరు వస్తున్నారు, వారికీ అన్నీ చెప్పండి కానీ ఏ పార్టీకి ఓటు వేస్తున్నామో మాత్రం చెప్పొద్దన్నారు. ఏం చెప్పకుండా సైలెంట్ గా ఓటు వెయ్యండంటూ పవన్ కళ్యాణ్ సూచించారు.