హైదరాబాద్, జనవరి 26: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా టీజేఎస్ అధినేత కోదండరామ్ ఎన్నికల కమిషన్ పై విరుచుకుపడ్డారు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్దంగా ఏం చేయాలో వారు అది చేస్తే చాలని, తామేం చేయాలో సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని టీజేఎస్ అధినేత కోదండరామ్ అన్నారు. కమిషన్కు సంబంధించిన అంశాల్లో అడిగే హక్కు తమకు ఉందని, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల అధికారికి ఉందని స్పష్టం చేశారు.ఇంకా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం అంటే రాజకీయ విప్లవం రావటం అన్నారు. భవిష్యత్తు నిర్మాణానికి బ్లూ ప్రింటు అని చెప్పారు. పాలకులు ఎవరైనా రాజ్యాంగ చట్రంలో నిలబడి పాలన చేయాలని, రాజ్యాంగానికి లోబడి నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారతరత్న పురస్కారాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు.