అమరావతి, జూలై 31: ఉద్దానం సమస్యపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ నేడు భేటీ కానున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో వీరి సమావేశం జరుగనుంది. కిడ్నీ సమస్యపై హార్వర్డ్ వైద్య బృందం చేసిన దర్యాప్తు నివేదికను ఈ మేరకు చంద్రబాబుకు పవన్ అందించారు. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని స్వాగతం పలికారు. పవన్ విజయవాడ పర్యటన విషయం తెలిసిన అభిమానులు ఎయిర్ పోర్టుకు తరలి వచ్చిన నేపధ్యంలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగి ఆయన అనుకున్న సమయానికి ఏపీ సచివాలయానికి చేరుకోలేక పోయారు దీంతో ఏపీ సీఎం 11గంటల వరకు ఆయన కోసం వేచివున్నారు. కాగా ఈ సమావేశం కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన తూర్పుగోదావరి జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు భేటీ విషయమై మీడియాతో పవన్ మాట్లాడనున్నారు.