హైదరాబాద్, జనవరి 24: టీఆర్ఎస్ ప్రభుత్వం తమ సొంత పనులకు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇష్టానుసారంగా వాడుకుంటోందని టీజేఎస్ అధినేత ప్రో. కోదండరాం విమర్శించారు. ప్రభుత్వ అధికారులే టీఆర్ఎస్ కు ఓటు వేయాలని చెప్తూ డబ్బులు పంచారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఓట్ల గల్లంతు విషయమై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి కోర్టుకు వెళ్లారని... దీంతో, ఓటరు జాబితాను సవరిస్తామని ఎన్నికల సంఘం చెప్పిందని... అయినా అసెంబ్లీ ఎన్నికల్లో 22 లక్షల ఓట్లు ఎలా గల్లంతయ్యాయని ఆయన ప్రశ్నించారు.
వీవీప్యాట్లను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే తీసుకొచ్చారని, అభ్యర్థులకు ఎక్కడైన అనుమానాలు ఉంటే ఆ పరిధిలో వాటి స్లిప్పులను లెక్కించాల్సి ఉందని, అయినా ఆ పని చేయలేదని కోదండరాం మండిపడ్డారు. ఈ విషయంలో ఈసీ రజత్ కుమార్ వ్యవహారశైలిపై అందరికీ అనుమానాలు ఉన్నాయని చెప్పారు. రజత్ కుమార్ పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కంచే చేను మేసినట్టుగా ఎన్నికల సంఘం ప్రవర్తించడం సరికాదని అన్నారు. ఎన్నికల సంఘంపై ఇలాంటి తీవ్ర ఆరోపణలు గతంలో ఎన్నడూ రాలేదని చెప్పారు.