న్యూఢిల్లీ, జనవారి 24: ఆథ్యాత్మిక గురువు రాందేవ్ బాబా జనాభా నియంత్రణపై సంచలన వ్యాఖ్యలు చేసారు. వొకటి లేదా ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగిన వారి ఓటు హక్కును రద్దుచేయాలని బాబా రాందేవ్ అన్నారు. ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉన్నవారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేదించాలని సూచించారు. వారికి ప్రభుత్వ పాఠశాలలో, ఆస్పత్రుల్లో ప్రవేశం కల్పించరాదని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వరాదని రాందేవ్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ చర్యలు చేపడితే తప్పకుండ జనాభా నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. అలీఘర్లో దుస్తుల షోరూం పతంజలి పరిధాన్ను ప్రారంభించిన ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేసారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. హిందువులైనా, ముస్లింలైనా జనాభా నియంత్రణే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగాలని సూచించారు. రాందేవ్ బాబా గతంలోనూ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లల్ని కన్న వివాహితుల ఓటు హక్కు రద్దు చేయాలని, తనలాంటి బ్రహ్మచారులకు ప్రత్యేక హోదా ఇచ్చి గుర్తింపు కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు.