ముంభై, జనవరి 23: టీం ఇండియా ఆటగాళ్ళు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ కాఫీ విత్ కరణ్ షో వివాదం ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. దీని వళ్ళ వారి కెరియర్ పై బీసీసీఐ కూడా సంచలన నిర్ణయం తీసుకొంది. అయితే ఈ వివాదంపై అనేక మంది ప్రముఖులు, అభిమానులు తీవ్ర స్థాయిలో స్పందించారు. కాని దీనికి మూల కారణమైన బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహర్ నుండి మాత్రం ఎటువంటి స్పందన లేదు. గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఈ వివాదంపై ఎట్టకేలకు కరణ్ స్పందించారు. ఇద్దరు యువ క్రికెటర్ల కేరీర్ పై ప్రభావం చూపిన ఈ వివాదానికి తానే బాధ్యత వహిస్తున్నట్లు కరణ్ పేర్కొన్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమానికి అన్నీ తానై వ్యవహరిస్తాను కాబట్టి అందులో జరిగే ప్రతి విషయానికి తానే భాద్యున్నని తెలిపారు.
అందులో పాల్గొనేవారు కేవలం అతిథులు మాత్రమే. ఇలాగే పాండ్యా, రాహుల్ లను సరదాగా ఇంటర్ల్యూకి పిలిచానని కానీ అది ఇలా వివాదంగా మారి వారి కెరీర్లపై ప్రభావం చూపుతుందని ఊహించలేదన్నారు. పాండ్యా వివాదాన్ని మొదట్లోనే అదుపులోకి తేవాలని చూశానని కానీ అది ఆగకుండా తన చేయిదాటిపోయిందన్నారు. దీనివల్ల పశ్చాత్తాపంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని అందువల్లే బయటకు వచ్చి దీనిపై మాట్లాడలేక పోయానని ఆయన వివరణ ఇచ్చారు. వారు బహిరంగ క్షమాపణ చెప్పి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు కాబట్టి ఇకనైనా వారిని వదిలిపెట్టాలని కరణ్ జోహర్ కోరారు.