తాడేపల్లిగూడెం, జనవరి 23: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వ్యతిరేఖంగా మాజీ మంత్రి, బిజెపి నేత మాణిక్యాల రావు సోమవారం నుండి చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. మంగళవారం రాత్రి ఆయనను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. తాడేపల్లిగూడేనికి చంద్రబాబు 56 హామీలు ఇచ్చారని చెబుతూ వాటిని అమలు చేయాలని మాణిక్యాల రావు సోమవారం ఉదయం దీక్షను ప్రారంబించారు.
తన నిరవధిక నిరాహార దీక్షను తొలుత తహాశీల్దార్ కార్యాయలం దగ్గర చేపట్టాలని మాజీమంత్రి భావించారు. అయితే అందుకు అనుమతి లేదని చెప్పడంతో ఆయన క్యాంప్ కార్యాలయంలోనే దీక్షకు దిగారు. గత నెల 25న చంద్రబాబు నాయుడుకి అల్టిమేటం ఇచ్చారు పైడికొండల మాణిక్యాలరావు. నెల రోజులు దాటినప్పటికి ముఖ్యమంత్రి నుంచి స్పందనరాకపోవడంతో సోమవారం నుంచి దీక్ష ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.