మూసి నదిలో నరబలి మృతదేహాలు...!

SMTV Desk 2019-01-23 12:02:57  Hyderabad, Black magic, Narabali two womens, Moosi river

హైదరాబాద్, జనవరి 23: హైదరాబాద్ మహా నగరంలోని మూసి నది సమీపంలో దారుణం చోటు చేసుకుంది. మూసి నదిలో ఇద్దరు గుర్తు తెలియని మహిళల మృతదేహాలు బయటపడ్డాయి. అయితే ఆ మహిళలను క్షుద్ర పూజలకు నరబలి ఇచ్చారని జోరుగా ప్రచారం సాగుతోంది. లంగర్ హౌస్ లో మృతదేహాలు కనిపించడంతో ఆ ప్రచారం మరింత ఊపందుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈనెల 22వ తేదీన మంగళవారం ఉదయం ఈ ఇద్దరు మహిళలు హత్యకు గురైవుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ ఇద్దరు మహిళల తలపై బలమైన గాయాలు ఉండటంతో క్షుద్రపూజల కోసమే నరబలి ఇచ్చారని పోలీసులు అనుమానిస్తునారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. ఈనెల 22వ తేదీ మంగళవారం పౌర్ణమి కావడంతో క్షుద్రపూజలు జరిగి ఉండొచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఇద్దరిని ఎక్కడో జరిగిన పూజల్లో చంపేసి మృతదేహాలను ఇక్కడ పడేసివుంటారని భావిస్తున్నారు. 2018లో చిలకానగర్‌లో ఓ పసిపాపను నరబలి ఇచ్చాక మృతదేహాన్ని మూసీలో పారేసిన సంగతి తెలిసిందే. మహిళలను సమీపంలోని కల్లు కాంపౌండ్‌ నుంచి తీసుకొచ్చి చంపారా? లేక ఎక్కడైనా చంపి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2018లోనూ చిలుకానగర్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పౌర్ణమి రోజున ఓ చిన్నారిని నరబలి ఇచ్చాక నిందితుడు మూసీలో పారేశాడు. ఇప్పుడు చోటుచేసుకున్న ఘటన కూడా అదే తరహా ఉదంతమేనా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రాథమిక ఆధారాలతో 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలుగా గుర్తించారు. ఓ మృతదేహానికి తల వెనుక భాగంలో, మరోదానికి కన్ను, నుదురు ప్రాంతాల్లో గాయాలను పోలీసులు గుర్తించారు.