న్యూఢిల్లీ, జనవరి 22: నిన్నటి నుంచి రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తుతోంది. సోమవారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపిలేకుండా వాన కురుస్తోంది. గురుగ్రామ్, ఢిల్లీలోని పలు ప్రాంతాలలో మంగళవారం ఉదయం వడగళ్లు పడ్డాయి. దాంతో చలి తీవ్రత మరింతగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ప్రాంతంలో పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి. నల్లటి మేఘాలు కమ్ముకోవడంతో ఉదయం 9గంటలు దాటినా వెలుతురు రాని పరిస్థితి నెలకొంది. ఈ భారీవర్షం కారణంగా నజఫ్గడ్లో వొక గొడౌన్ గోడకూలి ఇద్దరు మృతి చెందారు
దాంతో పట్టపగలే వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వచ్చింది. రాజధాని రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వర్షం కారణంగా ఢిల్లీకి వెళ్లే పలు రైళ్లు ఆలస్యమైనట్టు అధికారులు ప్రకటించారు. ఈ నెల 24 వరకూ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో బలమైన గాలులతోపాటు వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. భారీవర్షం కారణంగా నజఫ్గడ్లో వొక గొడౌన్ గోడకూలి ఇద్దరు మృతి చెందారు.