హైదరాబాద్, జనవరి 22: రాజంపేట తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు మేడా మల్లికార్జున్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ చేరడం ఖరారైంది. ఆయన మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. లోటస్ పాండ్ లోని జగన్ నివాసంలో ఈ భేటీ జరుగుతుందని సమాచారం.
రాజంపేట నియోజకవర్గం పంచాయతీని పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ నియోజకవర్గం నేతలతో ఓ వైపు సమావేశమవుతుంటే, జగన్ తో భేటీని మేడా మల్లికార్డున్ రెడ్డి ఖరారు చేసుకున్నారు.
చంద్రబాబుతో భేటీకి వెళ్లకుండా మేడా జగన్మోహన్ రెడ్డిని కలవడానికి నిర్ణయించుకున్నారు. తన సోదరుడు రఘునాథ రెడ్డి కోసమే మేడా మల్లికార్జున్ రెడ్డి మాట మార్చారని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ఆరోపించారు.
మేడా మల్లికార్డున్ రెడ్డి పార్టీ మారుతారంటూ గత కొద్ది కాలంగా ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారాన్ని మేడా మల్లికార్డున్ రెడ్డి నిజం చేస్తున్నారు. ఈ పరిణామాల మధ్య మేడా మల్లికార్డున్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రాజంపేట కార్యకర్తలు ఏకగ్రీవంగా చంద్రబాబును కోరారు. వారి కోరికను చంద్రబాబు మన్నించారు. టీడీపీ నుండి సస్పెండ్ చేస్తునట్టు వొక ప్రకటన వెలువడింది.