అమరావతి, జనవరి 22: ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీకి ఈరోజు రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పత్తా లేకుండా పోయారు. మల్లికార్జునరెడ్డిని తాను భేటీకి ఆహ్వానించానని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ తెలిపారు. తనతో వస్తానని మాట ఇచ్చిన మేడా ఇప్పుడు కనపడకుండా పోయారని విమర్శించారు. దాంతో కడప జిల్లా టీడీపీ రాజకీయం రసవత్తరంగా మారింది. చంద్రబాబు నిర్ణయాలకు తాము ఎప్పుడు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.
ఆయన ఈరోజు అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కడపలో మైనారిటీలు తెదాపాకి దూరం అయ్యారని సీఎం రమేశ్ అన్నారు. కాగా ఈసారి కడపలో ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మేడా పార్టీలోకి రాగానే ప్రభుత్వ విప్, టీటీడీ బోర్డు పదవి ఆయనకీ ఏది కావాలంటే అది ఇచ్చామని గుర్తుచేశారు. ఇంతచేసిన పార్టీకి ఇప్పుడు ద్రోహం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.