హైదరాబాద్, జనవరి 21: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు జోమాటో, స్విగ్గీ, ఉబెర్ ఈట్ లకు హైదరాబాద్ నగర పోలీసు శాఖ గట్టి వార్నింగ్ ఇచ్చింది. నగరంలో ట్రాఫిక్ ఉళ్లంఘనలకు పాల్పడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని సైబరాబాద్ సిపి సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి ఫుడ్ డెలివరీ చేయాలన్న ఆతృతతో ట్రాపిక్ రూల్స్ బ్రేక్ చేయడం, ర్యాష్ డ్రైవింగ్ కు పాల్పడుతూ కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కూడా కారణమవుతున్న పుడ్ డెలివరీ బాయ్స్ ని కట్టడి చేయాలని సిపి ఆయా సంస్థలకు సూచించారు. లేదంటే సంస్ధలపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సజ్జనార్ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల ప్రతినిధులను హెచ్చరించారు. ఫుడ్ డెలివరీ భాయ్స్పై వరుసగా వస్తున్న ఫిర్యాదులపై సీపీ స్పందించారు. ఉబర్ ఈట్, జొమాటో, స్విగ్గీ వంటి ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థల ప్రతినిధులతో ఆయన కమిషనరేట్లో సమావేశం నిర్వహించారు.
ఆయా సంస్ధలకకు చెందిన డెలివరీ బాయ్స్ ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉళ్లంగిస్తున్నారో సిపి వారికి వివరించారు. నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్, రాంగ్సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ వంటి ట్రాఫిక్ ఉళ్లంఘనలకు పాల్పడుతూ ఇతర వాహనదారులను ఇబ్బందులు పెడుతున్నారని సిపి తెలిపారు. కాబట్టి ఉద్యోగంలో చేర్చుకునే సమయంలోనే డెలివరీ బాయ్స్ ట్రాఫిక్ నిబంధనపై అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే వినియోగదారులతో మాట్లాడే సమయంలో బైక్ ను పక్కన నిలిపి మాట్లాడేలా చర్యలు తీసుకోవాలన్నారు. బైక్ కు సంబంధించి సరైన దృవీకరణ పత్రాలు వుంటేనే ఉద్యోగంలో చేర్చుకోవాలని సూచించారు. ఇకపై వారు ఎలాంటి ఉళ్లంఘనలకు పాల్పడినా ఆయా సంస్థలను బాధ్యులను చేస్తామని సజ్జనార్ ప్రతినిధులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.