అమరావతి, జనవరి 21: సోమవారం మీడియాతో సమావేశమైన ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ తెదేపాపై సంచలన వ్యాఖ్యలు చేసింది. స్వంత పార్టీలోనే తనకు శత్రువులు ఉన్నారని, కాని తాను టీడీపీని వీడుతానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆమె మరోసారి తేల్చి చెప్పారు. ఈ రోజు ఆమె ఓ తెలుగు న్యూస్ చానెల్తో మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆమె ఖండించారు. ఈ ప్రచారాన్ని ఆమె ఖండించారు. ఏదైనా సమస్య ఉంటే సీఎంతో మాట్లాడి పరిష్కరించుకొంటానని అఖిలప్రియ చెప్పారు. అంతేకానీ పార్టీ విడిచిపోనని ఆమె తేల్చి చెప్పారు. స్వంత పార్టీలోనే తనకు శత్రువులున్న విషయాన్ని చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లినట్టు ఆమె గుర్తు చేశారు.
ఈ విషయాలను బాబుకు చెప్పినట్టు తెలిపారు. ఆళ్లగడ్డపై చంద్రబాబుకు తప్పుడు రిపోర్టులు పంపుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డ విషయంలో తప్పుడు ప్రకటనలు పంపడం వెనుక పోలీసులు ఉన్నారా, ఇంటలిజెన్స్ అధికారులు ఉన్నారా, ఇంకా ఎవరున్నారో విషయం తనకు తెలియదన్నారు. తనను టార్గెట్ చేయాలని చాలామంది చూస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తాను, తన సోదరుడు బ్రహ్మానంద రెడ్డి తొలిసారి ఎన్నికలను ఎదుర్కొంటున్నందున పార్టీ చీఫ్ చంద్రబాబునాయుడు తమపై చాలా శ్రద్ద తీసుకొంటున్నారని ఆమె చెప్పారు.