సిద్ధిపేట, జనవరి 21: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో యాగాన్ని సోమవారం ప్రారంభించారు. సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌజ్లో జరగనున్న మహారుద్ర సహిత సహస్ర చండీయాగానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. కేసీఆర్ దంపతులు కాషాయ వస్త్రాల్లో యాగశాలకు చేరుకున్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వారూపానందేంద్ర సరస్వతి, వేదపండితులు మాణిక్య సోమయాజులు, నరేంద్ర కాప్రే, ఫణిశశాంక శర్మ తదితరుల ఆధ్వర్యంలో 5 రోజుల పాటు యాగం జరగనుంది.
మొత్తం 300 మంది రుత్విక్కులు దీనిలో పాల్గొంటారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా, అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిరంతరాయంగా కొనసాగేలా కేసీఆర్ యాగం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు యాగశాల వద్దకు సీఎం కుమార్తె కవితతో పాటు ఇటీవల టీఆర్ఎస్లో చేరిన వంటేరు ప్రతాప్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ చేరుకున్నారు.