హైదరాబాద్, జనవరి 21: ఎర్రవెల్లిలోని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో నేటి నుంచి ఈనెల 25వరకు మహారుద్ర సహిత సహస్ర చండీ మహాయాగం ప్రారంభం అయ్యింది. దీనిలో కర్ణాటక నుంచి వచ్చిన 200 మంది, తెలంగాణ నుంచి 50 మంది రుత్విక్కులు పాల్గొంటారు. గత రెండు వారాలుగా యాగ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ యాగాల కోసం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో 3 యాగశాలలో 16 హోమగుండాలను ఏర్పాటు చేశారు. శృంగేరీ పీఠం పండితులు ఫణిశశాంకశర్మ, గోపీకృష్ణశర్మల అధ్వర్యంలో ఈ యాగం నిర్వహించబడుతుంది. సిఎం కేసీఆర్ దంపతులు దీక్షధారణ చేసి ఈ యాగంలో పాల్గొంటారు. వారితోపాటు తెరాస నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు ప్రముఖులు హాజరవుతారు.