విజయవాడ, జనవరి 20: ఆదివారం ఉదయం వైసీపీ నేత వంగవీటి రాధా తన పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం రాజీనామా లేఖను వైసీపీ చీఫ్ వైఎస్ జగన్కు పంపారు. ఇవాళ ఉదయం నుండి పలువురు పార్టీ నేతలు ఆయనను బుజ్జగించినా కూడ ఆయన వెనక్కు తగ్గలేదు. విజయవాడ సెంట్రల్ సీటు నుండి పోటీ చేయాలని వంగవీటి రాధా ప్లాన్ చేసుకొన్నారు. అయితే ఈ స్థానం నుండి మల్లాది విష్ణు పోటీ చేస్తే పార్టీకి మెరుగైన ఫలితాలు వస్తాయని వైసీపీ భావిస్తోంది. ఈ తరుణంలో విశాఖ తూర్పు లేదా మచిలీపట్నం ఎంపీ స్థానం నుండి పోటీ చేయాలని వైసీపీ కోరింది.
జగన్కు పంపిన లేఖలో రాధా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అణచివేత విధానాలకు తాను పోరాటం చేస్తానని రాధా ప్రకటించారు. పోరాటమే తన ఊపిరి అంటూ చెప్పారు. ప్రజా సంక్షేమం, న్యాయం కోసం తాను పోరాటం చేస్తానని వంగవీటి రాధా ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవి సాధించాలంటే పార్టీలో నేతలపై ఆంక్షలు విధించడం మీకు తప్పనిసరి అంటూ జగన్ను ఉద్దేశించిన రాధా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి తాను పనిచేయబోనని వంగవీటి రాధా ప్రకటించారు.