హైదరాబాద్, జనవరి 19: శనివారం హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలోని నోవాటెల్ హోటల్లో జరుగుతున్న తెలంగాణ జాగృతి సదస్సుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ వొవైసీ హాజరయ్యారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ మాట్లాడుతూ..49 సంవత్సరాల వయస్సులోనూ యువ నాయకుడిగా పేరొందుతున్నానన్నారు. యువత అభివృద్ది చెందాలంటే పాలసీ మేకర్లలో యువప్రాతినిధ్యం పెరగాలని ఆయన ఆకాంక్షించారు. తన ప్రసంగాలు విద్వేషపూరితంగా ఉన్నాయంటే.. నలుగురిలో ఆలోచన రేకెత్తించడానికేనని అసదుద్దీన్ తెలిపారు. తన దృష్టిలో మహాత్మాగాంధీ కన్నా అంబేద్కర్ గొప్ప వ్యక్తని అభిప్రాయపడ్డారు.
జాతీయ పార్టీల్లో చేరితే ఉన్నత స్థానాలకు ఎదగలేరని, రాజకీయాల్లో యువత ప్రాధాన్యం పెరగాలంటే ఎమ్మెల్యే, ఎంపీ అర్హత వయస్సు 20 ఏళ్లకు తగ్గించాలన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ సామాజిక వేత్త అన్నాహజారే మాట్లాడుతూ.. ఏడాది, ఐదేళ్లు, పదేళ్లు ప్రాతిపదికగా లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. యువశక్తి సరికొత్త దిశగా ప్రయాణించి అద్బుతాలు సృష్టించాలని అన్నాహాజారే ఆకాంక్షించారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా యువత వెనుకడుగు వేయ్యొద్దని పిలుపునిచ్చారు. నిరంతరం నేర్చుకోవాలనే జిజ్ఞాస కూడా యువతలో ఉండాలన్నారు.