ఉత్తమ్ తప్పుకుంటేనే కాంగ్రెస్ కు అభివృద్ధి..!

SMTV Desk 2019-01-19 17:38:35  TPCC Chief Uttam kumar reddy, Sarve sathyanarayana, Bhatti vikramarka

హైదరాబాద్, జనవరి 19: కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ శనివారం మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేతగా మల్లు భట్టి విక్రమార్కను నియమించిన సంగతి తెలిసిందే. కాగా.. భట్టికి సీఎల్పీ పదవి ఇవ్వడం పట్ల సర్వే.. హర్షం వ్యక్తం చేశారు. భట్టికి సీఎల్పీ ఇవ్వడం మంచి నిర్ణయమని.. బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మరోసారి రుజువైందన్నారు.





తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ఉండి ఉంటే.. దళితుడు ముఖ్యమంత్రి అయ్యేవాడని అభిప్రాయపడ్డారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుతూ... తెలంగాణ కాంగ్రెస్ ని ప్రక్షాళన చేయాల్సి ఉందన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసమర్థుడని విమర్శించారు. సీఎల్పీ పదవి కోసం ఉత్తమ్ పాకులాడారని, ఎన్నికల్లో ఓటమికి కారణమైన ఆయన వెంటనే తన పార్టీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తమ్ న్యాయకత్వాన్ని నమ్ముకుంటే లోక్ సభ ఎన్నికల్లో గెలవడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. ఉత్తమ్ ని తప్పిస్తేనే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుందని వ్యాఖ్యానించారు.