అమరావతి, జనవరి 19: ఏపీ సీఎం చంద్రబాబు 2019 ఎలక్షన్ మిషన్పై శనివారం ఉదయం పార్టీ శ్రేణులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు కోల్ కత్తాలో జరగుతున్న యునైటెడ్ ఇండియా ర్యాలీకి దాదాపు 20 కి పైగా పార్టీల నాయకులు హాజరయ్యారు. కాని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాత్రం ఈ ర్యాలిలో పాల్గొనలేదని తెలిపారు. కాగా ఆ ర్యాలికి వచ్చిన వారంతా అందరూ మోడికి వ్యతిరేకులే అని అందుకే వీరిద్దరూ ర్యాలీకి హాజరు కాలేదని అన్నారు.
దీనిబట్టి చూస్తె కేసీఆర్, జగన్ ఇద్దరు మోడీ వెంటనే ఉన్నారు అన్నదానికి ఇది మరో నిదర్శనం అని అన్నారు. కర్ణాటకలో బీజేపీ దుర్మార్గ రాజకీయాలు చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భారతీయ జనతా పార్టీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. దేశంలోని ఆలయాల్లో అశాంతిని సృష్టిస్తోందని, శబరిమలలో ఉద్రిక్తలు రెచ్చగొడుతోందని, అయోధ్యంలో రామాలయం అంశాన్ని మరోసారి తెరమీదకు తీసుకొచ్చిందని, వీటన్నింటి పట్ల దేశప్రజలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.