కోల్కతా, జనవరి 18: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ జనవరి 19న కోల్కతాలో నిర్వహించనున్న మెగా ర్యాలీకి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. మమతా బెనర్జీకి మద్దతు తెలుపుతున్నట్టు రాహుల్ ఆమెకి లేఖ రాశారు. ‘దేశంలోని ప్రతిపక్షాలన్ని ఏకమై బలమైన శక్తిగా రూపొందుతున్నాయి. మోదీ ప్రభుత్వం చేసిన మోసపూరితమైన వాగ్దానాలు, అసత్యాల వల్ల ప్రజలు కోపం, నిరాశలో మునిగిపోయి ఉన్నారు. ప్రసుత్త భారతదేశం రేపటి గురించి ఆందోళన చెందుతుంద ని లేఖలో పేర్కొన్నారు. ఈ బలాలన్ని(ప్రతిపక్షాలు) రేపటి గురించి ఆశను రేకేత్తిస్తున్నాయన్నారు. కులం, మతం, ప్రాంతం, ఆర్థిక హోదాలతో సంబంధం లేకుండా దేశంలోని ప్రతి ఆడ, మగ, పిల్లలు, పెద్దలు అందరిని వీరు గౌరవిస్తారని తెలిపారు. బీజేపీ, మోదీ కలిసి ప్రజాస్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్ని, లౌకికవాద సిద్ధాంతాలను నాశనం చేశారు. వాటి పరిరక్షణ కోసం ప్రతిపక్షాలన్ని ఏకమవుతున్నాయని రాహుల్ లేఖలో పేర్కొన్నారు.
అయితే మమత నిర్వహించనున్న ఈ ర్యాలీకి రాహుల్ గాంధీ హాజరుకావడం లేదని సమాచారం. కాంగ్రెస్ పార్టీ తరఫున అభిషేక్ మను సింఘ్వీ, మల్లికార్జున్ ఖర్గే ఈ మెగా ర్యాలీలో పాల్గొంటారని తెలిసింది.