జైపూర్, జనవరి 18: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై రాజస్తాన్ భాజపా ఉపాధ్యక్షుడు జ్ఞాన్దేవ్ అహుజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ని.. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుతో పోల్చడమే కాక.. కాంగ్రెస్ పార్టీ తొందరలోనే అంతం కానుందని జోస్యం చెప్పారు. ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యానికి ఆఖరి చక్రవర్తి.. అలాగే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి చివరి అధ్యక్షుడన్నారు. అతి త్వరలోనే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు.
‘రాహుల్ తాను హిందువునని చెప్పుకుంటూ.. జంధ్యం ధరిస్తానని అంటున్నారు. మరి ఆయన చేత జంధ్యం ధరింపజేసిన బ్రాహ్మణుడి పేరు చెప్పగలరా అంటూ అహుజా ప్రశ్నించారు. త్వరలో రాజస్తాన్లో జరగబోయే రామ్గఢ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే అహుజా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోకూడా ఇలాంటి వ్యాఖ్యలు చాలా చేసారు.