కోల్కతా, జావారి 18: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ శనివారం కోల్కతాలో నిర్వహించనున్న భారీ ర్యాలీలో పాల్గొననున్నట్లు బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా తెలిపారు. భాజపాలో తనకు గౌరవం దక్కడం లేదన్న ఆయన, ‘రాష్ట్ర మంచ్ సంస్థ తరఫున ఈ ర్యాలీకి హాజరవుతానన్నారు. బీజేపీ నేతలు కొందరు ఆర్ఎస్ఎస్ సమావేశాలలో పాల్గొనగా లేనిది తాను టీఎంసీ ర్యాలీకి వెళ్ళ కూడదా అని సిన్హా సమర్ధించుకున్నారు. బీజేపీ పట్ల తన తీరును ఎవరూ ప్రశ్నించలేరన్నారు. సీఎం మమతా బెనర్జీని ముఖ్యమైన జాతీయ స్థాయి నేతగా ఆయన పేర్కొన్నారు.
ఈ ర్యాలీలో వివిధ పార్టీలకు చెందిన ముఖ్యమైన నేతలు హెచ్డీ దేవెగౌడ, మల్లికార్జున ఖర్గే, కేజ్రీవాల్, అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్ తదితరులు పాల్గొంటున్నారు. ఈ ర్యాలీకి శతృఘ్న సిన్హా ‘స్టార్ స్పీకర్ గా మారనున్నట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను కొన్నిరోజులుగా బాహాటంగానే తప్పుబడుతున్న శతృఘ్న సిన్హా బీజేపీకి చెందిన మరో సీనియర్ నేత యశ్వంత్ సిన్హా ఏర్పాటు చేసిన ‘రాష్ట్ర మంచ్ లో చేరారు. దాంతో ప్రభుత్వం ఆయనకు సెక్యూరిటీ సహా పలు సౌకర్యాలను ఉపసంహరించింది.