అమరావతి, జనవరి 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుల కోసం చంద్రబాబు ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ పథకంపై సంబంధిత అధికారులు తీవ్ర స్థాయిలో కసరత్తు ప్రారంభించారు. ఈనెల 21 న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈపథకంపై చర్చించి, ఆమోదించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయవర్గాల నుండి సమాచారం. రైతులు పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి సొమ్ముకోసం వెతుక్కునే అవసరంలేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.
దీనికోసం రైతుకు నేరుగా కొంత ఆర్థికసాయం చేయాలన్న ఉద్దేశంతో ఏపీ సర్కార్ ఉంది. తెలంగాణలో రైతు బంధు పేరిట పెట్టుబడి సహాయం అందిస్తున్నారు. దానికంటే మెరుగ్గా… భూమిని స్వయంగా సాగుచేసుకునే వారితోపాటు, కౌలుకు తీసుకున్న రైతులకూ సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం! వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచే రైతుకు పెట్టుబడి సహాయం చేయాలని దాదాపుగా నిర్ణయించినట్లు తెలిసింది.