మహారాష్ట్ర, జనవరి 17: ప్రాంతీయ డ్యాన్స్ బార్లపై రాష్ట్ర సర్కార్ విదించిన కఠిన నిబంధనలను సుప్రీంకోర్టు కొట్టేస్తూ సంచలన తీర్పునిచ్చింది. బార్లలో మందు, చిందు కలిసి నడవచ్చని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని డ్యాన్స్ బార్లు ప్రార్థనాలయాలు, విద్యాసంస్థలకు కనీసం కిలోమీటరు దూరంలో ఉండాలన్న నిబంధనను కూడా కోర్టు తోసిపుచ్చింది. ముంబైలో ఇది కుదరదని, దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలని కోర్టు అభిప్రాయపడింది. బార్లలో సీసీటీవీలు కచ్చితంగా ఉండాలన్న ప్రభుత్వ నిబంధనను కూడా కోర్టు కొట్టేయడం విశేషం.
ఇక ఈ బార్లలో డ్యాన్స్ చేసే వారికి టిప్స్ ఇవ్వాలి తప్ప వాళ్లపై డబ్బు వెదజల్లకూడదని కూడా కోర్టు తేల్చి చెప్పింది. అంతేకాదు బార్ రూమ్స్, డ్యాన్స్ ఫ్లోర్ మధ్య గోడ ఉండాలన్న నిబంధనను కూడా సుప్రీం కొట్టేసింది. ప్రార్థనాలయాలు, విద్యాసంస్థలకు కిలో మీటర్ దూరంలో బార్లు ఏర్పాటు చేయాలన్న నిబంధనను సవాలు చేస్తూ ఈ బార్ల యజమానులు సుప్రీంకోర్టుకు వెళ్లారు.