న్యూఢిల్లీ, జనవరి 17: ఈ సంవత్సరం జనవరి 2న శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన బిందు,కనకదుర్గలు హిందూ సంస్ధల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు మహిళలు తమకు 24 గంటల పోలీసు రక్షణ కల్పించాలని కోరుతూ పిటీషన్లు దాఖలు చేసారు. ఈ ఉమ్మడి పిటిషన్లను సుప్రీం కోర్టు శుక్రవారం విచారించనుంది. కన్నూర్ జిల్లాకు చెందిన వీరిద్దరూ అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించడాన్ని నిలువరిస్తూ హిందూ సంఘాలకు చెందిన నిరసనకారులు అడ్డుకున్నారు. అయ్యప్ప ఆలయంలోకి తమను అనుమతించాలని డిమాండ్ చేస్తూ వీరు నిరవధిక దీక్షకు దిగడం కలకలం రేపింది.
అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించడంపై ఆగ్రహిస్తూ కనక దుర్గపై ఆమె అత్త కర్రతో దాడి చేసింది. దీనిపై ఐపీసీ సెక్షన్ 341, 324 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.