బ్రహ్మానందం ఆరోగ్యంపై స్పందించిన కుమారుడు గౌతమ్..

SMTV Desk 2019-01-17 16:55:18  Brahmananadam, Heart surgery, Goutham

హైదరాబాద్, జనవరి 17: ప్రముఖ హాస్య నటుడు, హాస్యబ్రహ్మ బ్రహ్మానందంకు గుండె ఆపరేషన్ జరిగిందన్న విషయం తెలిసిందే. దాంతో ఆయన అభిమానులు, సన్నిహితులు కలవరపడుతున్నారు. కాగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుందని ఆయన తనయుడు హీరో గౌతమ్ తెలిపారు. కొన్నిరోజులుగా ఛాతీలో అసౌకర్యంగా అనిపించడంతో హైదరాబాద్‌లోని ప్రముఖ డాక్టర్‌ని సంప్రదించారు బ్రహ్మానందం. డాక్టర్‌ సలహా మేరకు శస్త్ర చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. దేశంలోనే అత్యుత్తమమైన ముంబైలోని ‘ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో ఈ నెల 14న గుండె ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయిందని, ప్రముఖ హృదయ శస్త్రచికిత్స నిపుణులు రమాకాంత్ పాండా తన తండ్రికి సర్జరీ చేసినట్టు చెప్పారు.

ఈ ససందర్బంగా ఆయన కుమారుడు గౌతమ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చటం జరిగిందని తెలిపారు. తన తండ్రికి శస్త్ర చికిత్స జరిగిందని తెలిసి అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ పరిశ్రమ లోని ప్రముఖులు అందరూ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారని, అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సుల వల్ల తన తండ్రి ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉందని చెబుతూ, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా, బ్రహ్మానందం కుమారులు రాజా గౌతమ్, సిద్దార్థ్‌లు, ఆయన కుటుంబసభ్యులు బ్రహ్మానందంతో పాటు ముంబైలో ఉన్నారు.