చంద్రుడిపై విత్తన మొలకలు..

SMTV Desk 2019-01-17 16:22:49  china, Scientists, Moon

చైనా, జనవరి 17: చంద్రుడిపై విత్తనాలు మొలకెత్తాయి, వొకటో.. రెండో కాదు.. ఏకంగా మూడు రకాల విత్తనాలు అంకురించాయి. చందమామకి అవతలివైపు అంటే ఎప్పుడూ చీకట్లోనే ఉండే ప్రాంతంలో విత్తనాలు మొలకెత్తడం వొక విశేషమైతే, భవిష్యత్తులో మనిషి చంద్రుడిపై ఇల్లు కట్టుకోవాలనుకుంటే.. ఆహారానికి ఢోకా లేదన్న భరోసా ఇచ్చే ప్రయోగం కూడా ఇదేనన్నది శాస్త్రవేత్తల అంచనా. సుమారు సంవత్సరం కింద చైనా వాళ్ళు ఛాంగే–4 పేరుతో జాబిల్లిపైకి ఓ ల్యాండర్‌ను ప్రయోగించారు. అది ఇంతవరకు ఎవరూ చూడని జాబిల్లి అవతలి ప్రాంతాన్ని చేరింది. దాంతో పాటు 7 అంగుళాల పొడవైన పెట్టెను మోసుకెళ్లింది. అందులో పత్తి, బంగాళాదుంప, ఆవాలు, అరబిడోపోసిస్‌ అనే చిన్న పూల మొక్క విత్తనాలతో పాటు ఈస్ట్, ఈగ గుడ్లు, గాలి, నీళ్లు ఉన్నాయి.



చంద్రుడిపై ఉండే ఉష్ణోగ్రతలను, రేడియోధార్మికతలను తట్టుకునే వస్తువులను ఎంపిక చేసి మరీ అక్కడకు పంపారు. నియంత్రిత వాతావరణంలో విత్తనాలు మొలకెత్తుతాయా.. లేదా అనేది పరిశీలించాలన్నది ప్రయోగ లక్ష్యం. కొన్ని రోజుల కింద పత్తి విత్తనాలు చిగురించాయి. చందమామపై అనేక దుర్భర పరిస్థితులను తట్టుకుని మరీ విత్తనాలు మొలకెత్తగలవన్న విషయం రుజువు కావడంతో భవిష్యత్తులో అక్కడ మనిషి నివాసం ఏర్పరచుకుంటే పంటలు పండించుకునే అవకాశం ఉందని ఈ ప్రయోగం ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ పత్తి విత్తనం మొలకెత్తిన ఫొటోను విడుదల చేసింది. అయితే, బంగాళా దుంప, ఆవాల విత్తనాలు కూడా మొలకెత్తాయని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న ప్రొఫెసర్‌ లియూ హాన్‌లాంగ్‌ వెల్లడించారు.