న్యూఢిల్లీ, జనవరి 17: కొత్తగా రెండు చానళ్లకు దూరదర్శన్ శ్రీకారం చుట్టింది. ఇండియా సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతో మరో రెండు కొత్త చానళ్లను దూరదర్శన్ మంగళవారం ప్రారంభించింది. డీడీ సైన్స్ పేరుతో వొక చానల్ను, ఇండియా సైన్స్ పేరుతో వెబ్ చానల్ను దూరదర్శన్ ప్రారంభించింది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్షవర్దన్ ఈ చానళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. శాస్త్రీయ దృక్పథం అభివృద్ధికి ఓ చానల్ అవసరమని అందుకు డీడీ సైన్స్ 24/7 చానల్ను సైన్స్కు అంకితమిస్తునట్లు తెలిపారు. దూరదర్శన్ జాతీయ చానల్లో వొక గంటపాటు డీడీ సైన్స్ చానల్ కార్యక్రమాలుంటాయని, ఇండియా సైన్స్ చానల్ మాత్రం ఇంటర్నెట్ ఆధారిత చానల్ అని పేర్కొన్నారు. దేశంలో ప్రతిభావ్యుత్పత్తులకు, మెరుగైన ఆలోచనలకు కొదవలేదన్నారు.
భారత దేశం లో వాటర్ షెడ్ ఉద్యమం కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్కే పరిమితం కాదని సమాజంలో అభివృద్ధి చెందిన శాస్త్రీయ దృక్పథానికి ఆ ఉద్యమం నిదర్శనమన్నారు. త్వరలోనే ఈ డీడీ సైన్స్ చానల్కు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. 2030 నాటికి సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచంలోనే మన దేశం మొదటి మూడు స్థానాల్లో వొకటిగా నిలుస్తుందన్నారు.