హైదరాబాద్, జనవరి 16: ఈరోజు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తమ పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్, లోటస్ పాండ్ లోని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లనున్న వేళ, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ బృందం, వైఎస్ జగన్ ఇంటి వద్ద కనిపించడం కలకలం రేపింది. జగన్ ఇంటికి వచ్చి వెళుతున్న వారి వివరాలను ఈ బృందం సేకరిస్తున్నట్లు సమాచారం. ఇక్కడి వివరాలను వారు విజయవాడకు చేరవేస్తున్నారని వైకాపా వర్గాలు ఆరోపించాయి.
వైఎస్ జగన్ ఇంటి వద్ద ఐబీ అధికారులను చూసిన వైకాపా నేతలు, కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగారు. వారు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.